27 December 2011

ఇట్టె సంసారికి ఏదియూ లేదాయే...

అజ్ఞానం కారణంగా ఈ జనులు సంసారాన్ని భారమనుకుంటున్నారు. జన్మించిన ప్రతి మానవుడూ, ఆడైనా, మగైనా సంసారసాగరమీదక తప్పదు! విశ్రాంతిలేకుండ ఈ భవసాగరమీదుతుంటే అలసిపోవడమే తప్ప సుఖములేదు. భక్తి అనేటి జ్ఞానంతో శ్రీవేంకటేశుడనే గట్టెక్కి సేదతీర్చుకుంటూ, ఆ విశ్రాంతిని ఆస్వాదించుకుని మరలా ఈదినట్టయితే అలసటతెలియదు, జీవితంమీద విసుగుండదు. ఈ గొప్ప తత్వాన్నిఅన్నమయ్య అందరికీ అర్థమయ్యేలా ఎంత సులువైన ఉదాహరణలతో చెప్తున్నారో వినండి...


===================
రాగం : ఆహిరి
ఇక్కడ వినండి
===================

పల్లవి
ఇట్టె సంసారికేదియు లేదాయ
తట్టువడుటేకాని దరిచేరలేదు

చరణం 1
ములిగి భారమోపు మోచేటివాడు
అలసి దించుకొను నాడాడను
అలరు సంసారికి నదియు లేదాయ
తొలగని భారమెందును దించలేదు

చరణం 2
తడవి వేపచేదు త్రావెడివాడు
ఎడయెడ దిను దీపేమైనను
అడరు సంసారికి నదియు లేదాయ
కడు జేదెకాని యెక్కడ దీపులేదు

చరణం 3
దొరకొని హేయమే తోడేటివాడు
పరిఠవించును మేన బరిమళము
అరిది సంసారికి నదియు లేదాయ
ఇరవు వేంకటపతి నెఱుగలేడు

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
ఇట్టె = అలా త్వరగా, క్షణాలలో
సాంసారికేదియు = సంసారికి + ఏదియు
తట్టువడు = బాధపడు, కష్టములు అనుభవించు
దరిచేరలేదు = గట్టుచేరడమన్నది లేదు, ముగింపులేదు

ములిగి  = కూర్చబడిన (packed)
భారపుమోపు = బరువైన మోపు 
(మోపు అనగా, ఉదాహరణకు గడ్డిని ఉంటగా తాడువేసికట్టితే దాన్ని "గడ్డిమోపు" అంటాము)
మోచేటివాడు = తలమీద మోచుకెళ్ళేవాడు
నాడాడను = ఆడ ఆడ = అక్కడక్కడ
అలరు = రోదించే, ఏడ్చే (ఈ అర్థం సరికాదని ఎందరు పండితులు నన్ను తంతారో - అయినా ఇది సరైన అర్థమే)
తొలగని = విడిపోని, తప్పుకోని

తడవి = కష్టపడి
వేపచేదు = చేదైన పదార్థము/ఔషధము, వేపనూన
త్రావెడివాడు = తాగేవాడు
(ఆ రోజుల్లో కొన్ని జబ్బులకు ఔషధముగా వేపనూనె తాగేవారు)
ఎడయెడ = మధ్యమధ్యలో
దిను = తిను
దీపేమైనను = తీపివస్తువేదైనా
అడరు = కష్టపడే
కడు = అత్యధికమైన
జేదేకాని = చేదేకానీ
దీపులేదు = తీపులేదు 
దొరకొని = (మార్గాంతములేక) సిద్ధపడి
హేయము = మలినము, మురికి
తోడేటివాడు = శుద్ధిచేసేవాడు, శుభ్రపరిచేవాడు
పరిఠవించును = ధరించును, చల్లుకొనును
మేన = శరీరము
బరిమళము = పరిమళము = సుగంధద్రవ్యము
అరిది = ధుర్లభమైన
ఇరవు = స్థిరమైన
నెఱుగలేడు = తెలుసుకోలేడు


తాత్పర్యం : [ పైన ఆడియో విన్నవారికి తాత్పర్యం అవసరం ఉండదు :-) ]
వేంకటవిభుని తెలుసుకోలేని అజ్ఞాని సంసారసాగరంలో పలు కష్టాలుపడుతూ భవసాగరమీదటమే తప్ప గట్టెక్కే మార్గమేలేదు.

అడవిలోనుండి కట్టెలమోపు మోసుకొచ్చేవాడు అలసినప్పుడల్లా అక్కడక్కడా ఆ మోపుని కిందదించిపెట్టి కాసేపు సేదతీర్చుకుంటాడు. అయితే అజ్ఞానియైన సంసారికి అటువంటి ఉపాయాలు తెలియవు. అందుకే మోస్తున్న సంసార భారాన్ని తొలగని భారమనుకుంటూ నిష్ఠూరపడుతుంటాడు.

జబ్బుతోనున్నవాడు చేదైన మందుని తాగేప్పుడు మందులోని చేదు తెలియకుండా ఉండేందుకు మధ్యమధ్యలో కొంచం తేనో, పంచదారో, లేక మరో తీపి పదార్థమో తింటాడు. వేంకటేశ మంత్రమన్న తీపిని తెలుసుకోలేని సంసారి తన జీవితాన ఉన్న చేదుని తాగుతూ ఇబ్బందులు పడుతుంటాడు; అతనికి చేదే తప్ప తీపియుండదు.

మురికికాలువలు శుభ్రపరిచేవాడు తన పని అయిపోగానే శుభ్రంగా స్నానంచేసి నానా విధములైన సుగంధద్రవ్యాలను తనమేనిపై చల్లుకుంటాడు. దుర్వాసనకు దూరమయ్యేందుకు పరిమళద్రవ్యాలు మార్గాలు. అలాగే సంసారంలో పడి నానాకష్టాలు పడుతున్న సంసారికి విముక్తి కలగాలంటే శ్రీవేంకటేశుని తెలుసుకోవడమే స్థిరమైన మార్గము.

================================
[ Lyrics in RTS format ]

rAgaM :  Ahiri

pallavi
iTTe saMsArikEdiyu lEdAya
taTTuvaDuTEkAni darichEralEdu

charaNaM 1
muligi bhAramOpu mOchETivADu
alasi diMchukonu nADADanu
alaru saMsAriki nadiyu lEdAya
tolagani bhArameMdunu diMchalEdu

charaNaM 2
taDavi vEpachEdu trAveDivADu
eDayeDa dinu deepEmainanu
aDaru saMsAriki nadiyu lEdAya
kaDu jEdekAni yekkaDa deepulEdu

charaNaM 3
dorakoni hEyamE tODETivADu
pariThaviMchunu mEna barimaLamu
aridi saMsAriki nadiyu lEdAya
iravu vEMkaTapati ne~rugalEDu
================================
-  annamayya / annamAchArya
================================

03 December 2011

ఇద్దరి తమకము నిటువలెనే...

అన్నమయ్య రాయని భావంలేదు. కీర్తనల్లోని భావాలు జీవితానికి ఉపయోగపడే పాఠాలుగానో, జీవితంలో ఎదుర్కొన్న గమ్మత్తయిన సంఘటనలుగానో ఉంటాయి. ఇది రాశాడు, ఇది రాయలేదని లేదు. రాసిన ప్రతిభావంలోనూ ఆ స్వామినే కీర్తించాడు, స్వామినే పోల్చాడు, అన్వయించాడు. స్వామివారి అన్ని లీలలనీ కీర్తనల్లో భావాలుగాచేసిన గొప్ప భక్తి అన్నమయ్యది.

ఈ కీర్తనలో శ్రీదేవీ పురుషోత్తములను యౌవనప్రాయమొచ్చిన బావామరదళ్ళుగా ఊహించుకున్నారు. మనసులు కలసిన ప్రేమికులు దొంగచాటుగా కలుసుకోవడం, కబుర్లుచెప్పుకోవడం వలపుధర్మంకదా? పెద్దలు పెట్టిన ముహూర్తంవరకు ఆగమంటే కుదురులేని మనసులు వింటాయా? ఒకరికై ఒకరు తపిస్తుంటారు. అయ్యవారేమో పదే పదే కలవాలని సైగలతో సందేశం ఇస్తుంటారు. ఆయనకు కుదిరినంత సులువుగా ఆమెకు కుదరద్దూ? ఎందరి కన్నులు కప్పి రావాలో. ఇన్నీ దాటుకుని ఆమె వచ్చినా అయ్యవారేమో "నీకు నామీద ప్రేమేలేదు; నన్ను చూడాలనే నీకు తోచదు" అని నిందిస్తున్నారు. నా పొందుకు నువ్వెంత పరితపిస్తున్నావో, నీ పొందుకు నేనూ అంతే పరితపిస్తున్నాననీ, కలుసుకోడంలో తనకున్న కష్టాలు ఇవీయని చెప్తున్నారు అమ్మవారు.

 ============================================
రాగం : మధ్యమావతి
శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో 
AUDIO 1
ఇక్కడ వినండి

AUDIO 2
(గాయకుల పేర్లు తెలిస్తే చెప్పండి)
 ============================================



పల్లవి
ఇద్దరి తమకము నిటువలెనే
పొద్దున నేమని బొంకుదమయ్యా

చరణం 1
లలి నాకధరము లంచమియ్యగా
పలు సోకులయి పరగెనవే
పిలువగరాగా బెరసి నిందవడే
పొలతికి నేమని బొంకుదమయ్యా

చరణం 2
అడుగుకొనుచు నిన్నంటి పెనగగా
తడయక నఖములు తాకె నవే
తొడుకొనిరాగా దూఱు మీదబడె
పొడవుగ నేమని బొంకుదమయ్యా

చరణం 3
పెక్కులు చెవిలో బ్రియములు చెప్పగ 
ముక్కున జవ్వాది మోచె నిదే
యిక్కడ శ్రీవెంకటేశుడ సడివడె
పుక్కటి నేమని బొంకుదమయ్యా

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
తమకము =  తొందర, విరహము
ఇటువలనే = ఇటువంటిదే (ఒకలాంటిదే)
పొద్దున = ఉదయం, తెల్లవాఱు
బొంకు =  అబద్ధము

లలి = ప్రేమ, వికాసము, ఉత్సాహము, సొగసు
లంచము = ఉత్కోచము, bribe
పలు = ఎక్కువ, అనేకము
సోకు = స్పర్శ
పరగెనవే =పరసరించినవి, వ్యాపించినవి, పెరిగినవి
బెరసి = క్రూరంగా
నిందవడే = అపవాదమొచ్చెను
పొలతి = మగువ

అడుగుకొను = ప్రాధేయపడు
తడయక = అడ్డులేక
తొడుకొనిరాగా = పట్టుకునిరాగా
దూఱు = నింద
పొదువుగ = కప్పిపుచ్చేలా
పెక్కులు = పలుమార్లు, చాలాసార్లు (పెక్కులంటే మాటలని కూడా అర్థముంది)
ప్రియములు = ప్రేమపూరితమైన మాటలు
జవ్వాది =  పునుగు, సంకుమదము
మోచెనిదె = అంటినది
సడి = అపకీర్తి, నింద, అపవాదము
పుక్కటి = ఊరకే, అప్రయత్నంగ

తాత్పర్యం :
నన్ను కలసుకోవాలని నువ్వెంత తపన పడుతున్నావో, నేనూ అంతే తపనపడుతున్నాను. మనం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఎవరి కంటైనా పడితే వాళ్ళడగరూ ఏం చేస్తున్నారని? ఆ సమయానికి వారికి చెప్పేందుకు ఏం సాకులుంటాయి? నువ్వు రమ్మన్నా నేను రాలేదంటే ప్రేమలేకకాదు; ఏ వంకతో కలవాలో తెలియక.

ఎలాగో కలుసుకున్నా, నాకేమో వెళ్ళాలనీ, నీకేమో ఉండాలనీ ఉంటుంది. నువ్వు ఊరుకుంటావా? నన్ను ఇక్కడే కట్టిపడేసేలా, ప్రేమగా అధరాలతో ముద్దుల లంచములిచ్చిపుచ్చుకుంటాము. అప్పుడు తనువులు తాకి, పరవశములు పెరిగిపోతాయి. స్పర్శలూ పెరుగుతాయి. ఇంతలో నేనుకనబడలేదని మావాళ్ళు నన్ను వెతుక్కుంటారు. వెతికే చెలికత్తెలు నన్నుగనుక ఇక్కడ చూస్తే ఇక అంతే! అనవసరమైన నిందలొస్తాయి. ఇక్కడెందుకున్నావని అడిగితే నేనేంవంక చెప్పను?

వెళ్ళాలి వదులు అని నేను బ్రతిమాలుతుంటే నువ్వోమో ఇంకా నన్ను గట్టిగా లాక్కునే ప్రయత్నం చేస్తావు. ఆ కంగారులో నీ గోళ్ళు నా మేన గాయాలుచేస్తాయి. ఆ గాయాలెంటి అని అడగరూ? నిన్ను తీసుకోస్తునట్టు, నీచేయిబట్టుకొని వద్దామనుకుంటాను. ఏంటి ఇలా చేయిబట్టి తీసుకొస్తున్నావే? అని చెలికత్తెలు దూషించనూవచ్చు. దూషించేవారికి ఏం కట్టుకథలు చేప్పగలము?

మనం కలిసి చిలిపి రహస్యాలు చెవిలో ముచ్చటించినప్పుడు నీ బుగ్గలమీదున్న జవ్వాది నా ముక్కుకంటుకుంటుంది. అది చూసి నా చెలికత్తెలందరూ గుసుగుసగా నవ్వుకుని, అనుమానంగా అడుగుతారు. ముందుగా ఏమీ ఆలోచించుకోకుండా అప్పటికప్పుడే నేను తికమకపడుతూ ఏం కథలు చెప్పినా వారు నన్ను నమ్మరు, స్వామీ! మనిద్దరికీ అపవాదమొస్తుంది.

================================

rAgaM : madhyamAvati

pallavi
iddari tamakamu niTuvalenae
podduna naemani boMkudamayyaa

charaNaM 1
lali naakadharamu laMchamiyyagaa
palu sOkulayi paragenavae
piluvagaraagaa berasi niMdavaDae
polatiki naemani boMkudamayyaa

charaNaM 2
aDugukonuchu ninnaMTi penagagaa
taDayaka nakhamulu taake navae
toDukoniraagaa doo~ru meedabaDe
poDavuga naemani boMkudamayyaa

charaNaM 3
pekkulu chevilO briyamulu cheppaga
mukkuna javvaadi mOche nidae
yikkaDa SreeveMkaTaeSuDa saDivaDe
pukkaTi naemani boMkudamayyaa
================================

12 October 2011

ఎటువంటి మోహమో, ఎట్టి తమకమో గాని...


స్వామి వియోగంలో వున్న అమ్మావారి స్థితిని ఈ కీర్తనద్వారా  చెలికత్తె మాటల్లో తెలియజేస్తున్నాడు అన్నమయ్య.


===============================================
రాగం : సామంతం
గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ (GBK) గారి గళంలో
ఇక్కడ వినండి (right click and open in a new window/tab)
===============================================

పల్లవి
ఎటువంటి మోహమో యెట్టి తమకమో కాని
తటుకునను దేహ మంతయు మఱచె చెలియ

చరణం 1
పలుకుదేనెల కొసరి పసిడికిన్నెర మీటి
పలుచనెలుగున నిన్ను బాడి పాడి
కలికి కన్నీరు బంగారుపయ్యెద నొలుక
తలయూచి తనలోనె తలవంచు చెలియ

చరణం 2
పడతి నీవును దాను పవళించుపరపుపై
పొడము పరితాపమున బొరలి పొరలి
జడిగొన్న జవ్వాది జారుచెమటల దోగి
యుడుకు నూరుపుల నుసురుసురాయె చెలియ

చరణం 3
తావిచల్లేడి మోముదమ్మి గడు వికసించె
లోవెలితి నవ్వులను లోగి లోగి
శ్రీవేంకటేశ లక్ష్మీకాంత నిను గలసి
ఈ వైభవము లందె నిదివో చెలియ

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
తటుకున = తటుక్కున

పలుకుదేనెల = తేనెలవంటి మాటలు
కొసరి = అర్ధించి
పసిడికిన్నెర = బంగారువీణ
పలుచనెలుగున = పలుచని+ఎలుగున = సన్నటి గొంతుతో, గళముతో
బాడిపాడి = పాడిపాడి = పలుమార్లు ఆలపించి

పొదము = కలిగే
బొరలి పొరలి = పొరలిపొరలి
జడిగొన్న = వ్యాపించియున్న
దోగి = తడిసి / కరిగి
నుసురుసురాయె = అల్లాడిపోవు / తపించు

తావిచల్లేడి = సువాసనలు వెదజల్లే
మోముదమ్మి = తామెరవంటి ముఖము
గడు వికసించె = అద్భుతముగ వికసించెను
లోవెలితి = లోపల వెలితిగాయున్న


==========================================
rAgaM : sAmanthaM

pallavi
eTuvaMTi mOhamO yeTTi tamakamO kAni
taTukunanu dEha maMtayu ma~rache cheliya

charaNaM 1
palukudEnela kosari pasiDikinnera meeTi
paluchaneluguna ninnu bADi pADi
kaliki kanneeru baMgArupayyeda noluka
talayUchi tanalOne talavaMchu cheliya

charaNaM 2
paDati neevunu dAnu pavaLiMchuparapupai
poDamu paritApamuna borali porali
jaDigonna javvAdi jAruchemaTala dOgi
yuDuku nUrupula nusurusurAye cheliya

charaNaM 3
tAvichallEDimOmu dammi gaDu vikasiMche
lOveliti navvulanu lOgi lOgi
SreevEMkaTESa lakshmee kAMta ninu galasi
ee vaibhavamu laMde nidivO cheliya
==========================================

11 October 2011

కలికి సిగ్గుల తొలకరివానలు కురిసే...

అన్నమయ్యవారి ప్రతి కీర్తనలోనూ ఒక ఇతివృత్తం(థీం) ఉంటుంది. పదాల ఎన్నికలో ఒక క్రమపద్ధతి ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే ఈ కీర్తనలో అమ్మవారి సొబగులను వివిధ రకాల వర్షాలతో పోలుస్తున్నాడు అన్నమ్మయ్య. పదాలలో సరళత్వమూ, వర్ణనలలో ఆశ్చర్యముకలిగించే ఊహలూ ఉన్నాయి.

ఈ కీర్తనకు తాత్పర్యమూ, ముందుమాటా అసలు అక్కర్లేదు. ఎందుకంటే చదవగానే ఇట్టే అర్థమైపోతుంది. కీర్తనలోని భావాము అంతా తన గళమాధుర్యంలో పలికేశారు పద్మశ్రీ బాలసుబ్రమణ్యం గారు. ఈ కీర్తనగురించి పేజీలు పేజీలు రాసినా అర్థంచేసుకోలేని భావాలను ఐదునిముషాల్లో పాడేశారు.

====================================
రాగం : సౌరాష్ట్రం
బాలు గారు అద్భుతంగా ఆలకించిన ఈ కీర్తన 
ఇక్కడ వినండి (right click and open in a new window/tab)
====================================


పల్లవి
పొలతికి నీతోపొందు పోకకు బుట్టెడాయ
యెలమి నీభాగ్య మిక నెంతైనా గద్దయ్యా

చరణం 1
పడతిచెక్కుల వెంట బన్నీటివాన గురిసె
వడి నందె మెఱుగులవాన గురిసె
విడివడి తురుమున విరులవాన గురిసె
చిడుముడి జవ్వనము చిగిరించెనయ్యా

చరణం‌ 2 
మొలకనవ్వులనే ముత్యాలవాన గురిసె
వలపుల బెనుజడివాన గురిసె
కలికిసిగ్గుల దొలుకరివానలు గురిసె
పలుమారు జవ్వనము పదనెక్కీనయ్యా

చరణం‌ 3
సొరిది మోవితేనల సోనలవాన గురిసె
వరుస రతుల దతివాన గురిసె
యిరవై శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
పరగిన జవ్వనము పచ్చిదేరెనయ్యా

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
పొలతి = మగువ, ఇంతి, స్త్రీ
పొందు = జత, తోడు, స్నేహము
పోక = నడక, (పోకకు = జీవయాత్రకు, బ్రతుసాగించేందుకు)
[పోక అంటే వక్క అని మఱో అర్థంకూడా ఉంది]
పుట్టెడు = గంపయంత (కొలమానం)
ఎలమి = సంతోషము, ఆనందము
కద్దయ్యా = కలదయ్యా

పడతి = మగువ, స్త్రీ
చెక్కులు = చెక్కిళ్ళు, బుగ్గలు
పన్నీరు = సుగంధనీరు, గులాబినీరు
విడివడి = వదులుకున్న కురులు
తురుము = కొప్పు
వురులు = పువ్వులు
చిడుముడి = బాల్య దశనుండి, ఆ ముడి వీడి యౌవనంలోకి ప్రవేశించిన పడతి
జవ్వనము = పడుచునము, యౌవనము

మొలకనవ్వు = లేతనవ్వు, చిరునవ్వు
పెనుజడివాన = భారీవర్షము
పలుమారు = పలుమార్లు
పదనెక్కినయ్యా = కళకళలాడెనయ్యా / వికసించెనయ్య

సొరిది = క్రమలక్షణమైన, శృంగారమైన
మోవి = పెదవులు
వరుసరతి = పద్దతిగల సంగమం
తతివాన = ఋతువనబడేవాన, అదనెఱిగిన వాన
ఇరవై = స్థిరపడి
ఇంతి = స్త్రీ
పరగిన = ప్రసరించిన, పెరిగిన

జవ్వనము = పడుచుతనము, యౌవనము
పచ్చిదేరెనయ్యా = వికసించెనయ్య, కొత్తకళలొచ్చెనయ్యా


తాత్పర్యం :
ఈ శ్రీదేవి ఎంతపుణ్యం చేసుకుందో, నీ పొందుచేరే భాగ్యం లభించింది. జీవితయాత్రలో కలిసి నడిచేందుకు నీవంటి మహానుభావుని తోడు దొరికింది. [ఆమెకూడా ఏం తక్కువకాదు, గనుక పురుషోత్తముడుకూడా అదృష్టవంతుడే అని అమ్మవారి గొప్పలను చరణాలలో చెప్తున్నారు అన్నమయ్య]

ఈమె చెక్కిళ్ళవెంటగారి చెమట పన్నీటివర్షంలా కురుస్తున్నది. ఆ చెమట చినుకులు బుగ్గలను తడిమి నేలజారినందువలనకాబోలు మెఱుగులవర్షంలా ఉంది. బుగ్గలను తాకగానే చెమట బిందువులు మెఱుస్తాయా అని అడుగుతారేమో. అక్కడే ఉంది గుట్టు. ఆము బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కి వున్నాయి. ఈ చెమట ఆమె బుగ్గసిగ్గుని కడిగేస్తూ నేల రాలింది. అందుకే ఆ చెమటల పన్నీటి వాన మెఱుస్తున్నది. ఈమె కురులు విరియబోసినట్టుగా(loose hair) అలంకరించుకున్నది. ఆ కురులలోనుండి రాలుతున్న పువ్వులను చూస్తుంటే విరులవర్షంలా ఉంది. విరులవర్షం మధ్య చిగురించే ఆమె అందం ఎలా ఉన్నదంటే, అప్పుడే బాల్య దశనుండి, ఆ బాల్యముడి వీడి యౌవనంలోకి ప్రవేశించిన పడతిలా ఉంది. [చిడుముడి = బాల్య దశనుండి, ఆ ముడి వీడి యౌవనంలోకి ప్రవేశించిన పడతి]


ఆమె చిరునవ్వు చిందుతుంటే ముత్యాలవర్షం కురిసినట్టుంది. ఆ లేతనవ్వులలో ఆమె మదిలోదాచుకున్న ప్రేమంతా పెనుజడివానలా కురిపించేస్తుంది. ఆ కలికి ఎలా సిగ్గుపడుతుందంటే ఎలా ఉందంటే తొలకరివాన కురిసినట్టుంది. తొలకరివాన కురిస్తే పుడమి తల్లి ఎలాగైతే కొత్త చిగుర్లు తొడుగుతుందో, అలా  సిగ్గుల తొలకరులు కురిపిస్తుంటే ఆ పడతియొక్క పడుచుతనానికి ఇంకా ఇంకా అందం వచ్చేస్తూ ఉంది.


శృంగారమొలికించే ఆమె పెదవులవెంట సన్నటి తేనెవాన కురుస్తుంది. ఆ మగువయొక్క మదిభావము గ్రహించి,  ఆమెను కలిసినవేళ అదునెఱినవర్షం కురిసింది. ఆమె చిత్తములో స్థిరపడి, శ్రీవేంకటేశుడు ఆ మగువను మనువాడి కూడినవేళ ప్రసరించిన ఆమె యౌవనము పచ్చిదేరినది. 


====================================
     rAgaM : sourAshTraM
     pallavi

    polatiki neetOpoMdu pOkaku buTTeDAya
    yelami neebhAgya mika neMtainA gaddayyA

    charaNaM 1

    paDatichekkula veMTa banneeTivAna gurise
    vaDi naMde me~rugulavAna gurise
    viDivaDi turumuna virulavAna gurise
    chiDumuDi javvanamu chigiriMchenayyA

    charaNaM 2

    molakanavvulanE mutyAlavAna gurise
    valapula benujaDivAna gurise
    kalikisiggula dolukarivAnalu gurise
    palumAru javvanamu padanekkeenayyA

    charaNaM 3

    soridi mOvitEnala sOnalavAna gurise
    varusa ratula dativAna gurise
    yiravai SreevEMkaTESa yiMti niTTe kUDitivi
    paragina javvanamu pachchidErenayyA

====================================

25 August 2011

సరసాలాడుతున్న గోపాలకృష్ణుడు...

ఈ రోజుల్లోలాగ ఎక్కడబడితే అక్కడ దాహశాంతికి చల్లని పానీయాలు (కూల్ డ్రింకులు) ఉండేవి కాదారోజుల్లో. ఎంచక్కా మజ్జిగమ్మేవారు ఆడవాళ్ళు. మజ్జిగకన్నా దాహశాంతినిచ్చే చల్లటిపానీయాలు వేఱేవి ఉండవని నా అభిప్రాయం.

సన్నివేశం : మజ్జిగమ్మే ఒక గొల్లభామతో సరసాలాడుతున్నాడు యదుకుల నందనుడు. ఆ గొల్లభామ ఏం తక్కువైంది కాదు. తనూ గొప్ప జాణే (నేర్పరే)!
 ఈ కీర్తన విని కిరణ్ గీసిన బొమ్మ ఇది


నువ్వమ్మే మజ్జిగకు ఇంత రుచి ఎలా వచ్చింది? దూడ త్రాగి మిగిలిన పాలను పిండి, కాచి, చేమిరి తోడేసి ఆ పెరుగుని మజ్జిగ చేయడంవలన వచ్చిందా? లేక ఈ గొల్లభామచేత చిలకడబటంవల్ల ఇంత రుచి వచ్చిందా? అని కొంటెగా చమత్కారం చూపుతున్నాడు అల్లరి చిల్లరి బాలకృష్ణుడు. ఆ గొల్లభామకూడా కొంటెగానే సమాధానమిస్తుంది.

ఆ దృశ్యాన్ని అన్నమయ్య యుగళ గీతంగా(Duet) రాశారు. అన్నమయ్య ఎన్నో కీర్తనలను జానపదశైలీలో రాశారు. చెప్పాలనుకున్న భావాన్నిబట్టి శైలీనేంచుకున్నారు. ఇదొకరకమైన Teasing song. ఇందులో పదప్రయోగాలు అద్భుతంగా ఉంటాయి. 

ఆ చిన్ని కృష్ణుడి రూపంలో ఉన్నది తిరుమలగిరి శ్రీవేంకటేశుడే! ఆ సొగసరిగొల్లెత ఎవరో కాదు; ఆ పురుషోత్తముణ్ణి వరించిన అలమేలుమంగ నాంచారమ్మే... వాళ్ళను పలువేఱురూపాలలో ఊహించుకుని పాటలుకట్టడమే అన్నమయ్యెంచుకున్న భక్తి మార్గం. మీరే వినేయండి పాటని.
===============================================
రాగం : శ్రీరాగం
గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు స్వరపరచి జానకి గారితో పాడిన
ఇక్కడ వినండి (right click and open in a new window/tab)
 (సాహిత్యానికీ AUDIOకీ ఉన్న కొన్ని తేడాలను గమనించగలరు)
===============================================

పల్లవి
జాణతనా లాడేవేలే జంపుగొల్లెతా వోరి
ఆణిముత్యముల చల్లలవి నీకు గొల్లలా

చరణాలు :
పొయవే కొసరుజల్ల బొంకుగొల్లెతా వోరి
మాయింటి చల్లేల నీకు మనసయ్యీరా
మాయకువే చల్ల చాడిముచ్చు గొల్లెతా వోరి
పోయవొ పోవొ మాచల్ల పులుసేల నీకును?

చిలుకవే గోరం జల్ల జిడ్డుగొల్లెతా వోరి
పలచని చల్ల నీకు బాతికాదురా
కలచవే లోనిచల్ల గబ్బిగొల్లెతా వోరి
తొలరా మా చల్లేల దొరవైతి నీకు?

అమ్మకువే చల్లలు వొయ్యారిగొల్లెతా వోరి
క్రమ్మర మాతోడ నిట్టే గయ్యాళించేవు
సొమ్మెలం బోయేవేలే సొంపుగొల్లెతా వోరి
దిమ్మరి కోనేటిరాయ తిరమైతి నీకును

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు) :
జాణతనము = నేర్పరితనము, టెక్కు
జంపు = మందము
గొల్లెత = గొల్లభామ
గొల్లలా = కొల్లగా వస్తాయా

కొసరు = ఇంక కాస్త
బొంకు = అబద్ధము
మాయకువే = మోసంచెయ్యకువే, దాయకువే
జాడిముచ్చు = కపటుము, కపటి

గోరం = త్వరగా
జిడ్డుగొల్లెతా = హుషారులేకుండ జాగారే గొల్లభామ
పలుచని = నీరెక్కువున్న
బాతికాదురా = నచ్చదురా / సరిపోదురా
కలుచవే = కలియతిప్పు
గబ్బిగొల్లెతా = బడాయి గొల్లభామా
తొలరా = తొలగిపోరా, వెళ్ళిపోరా

క్రమ్మర = వచినదారి చూడరా, వెనక్కెళ్ళరా, get lost
గయ్యాళించేవు = విసుగించేవు, వాదించేవు
సొమ్మె = మైమర
సొంపుగొల్లెతా = సొగసొలికే గొల్లభామా
దిమ్మరి = భ్రమపడిన
తిరమైతి = స్థిరమైతిని

తాత్పర్యం :
చిన్నికృష్ణుడు : నాక్కొంచం మజ్జిగపోసి వెళ్ళమంటుంటే టెక్కుచూపుతున్నావెందుకే జంపుగొల్లెతా?
గొల్లెత :  ఆణిముత్యాలకన్నా మేలైనవిరా మా చల్లలు; అవి నీకు దోపిడి ఇచ్చినట్టు ఊరికే ఇవ్వాలా? పైకమివ్వు మజ్జిగపోస్తాను.

చిన్నికృష్ణుడు : డబ్బులిచ్చి కొనుక్కున్నోళ్ళకు మజ్జిగిచ్చి కొంచం 'కొసరు' మజ్జిగపోస్తావుకదా? డబ్బుళ్ళేవు నాదగ్గర, నాకు ఆ కొసరుమజ్జిగ మాత్రం పొయ్యి.
గొల్లెత :  రోజూ నీతోపడలేక చస్తున్నాన్రా. మాయింటి చల్లే యెందుకు నచ్చుతుందో నాకర్థం కాదు.
చిన్నికృష్ణుడు : ఓ కపటమెఱిగిన గొల్లెతా, మాటలుచెప్పి మజ్జిగపొయ్యకుండా మాయమైపోవాలని చూడకు.
గొల్లెత :  నీకు తెలియదు. ఈ మజ్జిగ చండాలమైన పులుపుగా వుంది. ఈ మజ్జిగ బాగుండదు వెళ్ళు.

చిన్నికృష్ణుడు : నీకు తెలుసుకదా నాకు పుల్ల మజ్జిగే ఇష్టం. జాగుచెయ్యకుండా త్వరగా చిలికి పోసివెళ్ళవే.
గొల్లెత : ఈరోజు మజ్జిగ బాగా పలచగా వున్నాయ్. అందుకే నీకు మజ్జిగ పొయ్యడంలేదు. నీకు నచ్చదులే వెళ్ళు.
చిన్నికృష్ణుడు : అదేంపలచగాలేదులేగానీ, కొంచం అలా చెయ్యొపెట్టి చిలికిపొయ్యి చిక్కటి మజ్జిగ అడుగునుంటుంది.
గొల్లెత :  దొరా, ఎంతచెప్పినా వినవా? గొప్పింటీ పిల్లాడివి! ఇలాంటి చల్ల నీకెందుకులే వెళ్ళిరా.

చిన్నికృష్ణుడు : ఓసి ఒయ్యారి గొల్లభామా, మరి అలాంటి చల్లెందుకు అమ్ముతున్నావే?
గొల్లెత :  నెమ్మదిగా చెప్తున్నాను, నన్ను విసిగించకు. వచ్చిన దారిన తిరుగెళ్ళిపో, అదే నీకు మంచిది.
చిన్నికృష్ణుడు : సొగసరి గొల్లెతా, విసుక్కోకుండ ప్రేమగా మైమరచి మజ్జిగపొయ్యొచ్చుకదా నాకు? వెంటనే వెళ్ళిపోతాను.
గొల్లెత :  నామీద మనసుపడి ఆ కొండలుదిగివచ్చిన కోనేటిరాయుడా! ఊరికే అలా ఉడికించానంతే! నువ్వే నా పంచ ప్రాణాలని ఎప్పుడో మనసులో స్థిరంచేసుకున్నాను. 
==============================================================

rAgaM : Sree rAgaM


pallavi

jANatanA lADEvElE jaMpugolletA vOri
ANimutyamula challalavi neeku gollalA


charaNAlu :

poyavE kosarujalla boMkugolletA vOri
mAyiMTi challEla neeku manasayyeerA
mAyakuvE challa chADimuchchu golletA vOri
pOyavo pOvo mAchalla pulusEla neekunu?

chilukavE gOraM jalla jiDDugolletA vOri
palachani challa neeku bAtikAdurA
kalachavE lOnichalla gabbigolletA vOri
tolarA mA challEla doravaiti neeku?

ammakuvE challalu voyyArigolletA vOri
krammara mAtODa niTTE gayyALiMchEvu
sommelaM bOyEvElE soMpugolletA vOri
dimmari kOnETirAya tiramaiti neekunu

==============================================================

21 August 2011

నన్నిటు చూడగ నవ్వితివి...

ఏ బంధంలోనైనా పంతాలూ, సాధింపులూ సహజం. అభిమానం, ప్రేమ ఉన్నచోటేగా కోపాలూ, తాపాలూ ఉంటాయ్? ప్రేమించేవారి మీదేగా కోపంచూపగలం? ఊరికే దారినపొయ్యేవాణ్ణి పిలిచి "ఒరేయ్ బడుద్ధాయ్, నీ మీద నాకు కోపమొచ్చింది! నీతో మాట్లాడను" అన్నామనుకోండి, మనల్ని ఎగా దిగా చూసి "అలాగే నాయనా, నువ్వు నాతో మాట్లాడకపోవడమే మంచిది. అది నా పూర్వజన్మ సుకృతం" అంటాడు.

ఆలు-మగలు బంధంలో ఎంతకెంత ప్రేముంటుందో అంతకంత పంతాలుంటాయ్. వీరి ఈగోల(ego) గోలలో కొన్నిసార్లు న్యాయం ఉండచ్చు, కొన్ని సార్లు అసలు లేకపోవచ్చు. ఇక్కడ అమ్మవారికీ-అయ్యవారికీ ఇదే ప్రాబ్లం.

చోటు : తిరుమల
సమయం : సుమంగళి స్త్రీ నుదుటి తిలకంలా తూర్పుకొండలపైన భానుడు మెఱస్తున్నాడు

చిరునవ్వుతోకాకుండ, ఎందుకో ఈ రోజు చిరాకుతో మొదలైంది, అమ్మవారికి! ఎవరిమీద చూపగలదు చిరాకునీ, కోపాన్నీ? ఉన్నది ఆయనేగా? ఆమె చిరాగ్గా ఉందని తెలియక మామూలుగా "నాస్తా తయారైందా? ఇంద్రలోకంలో జరిగే దేవతల సమావేశానికి వెళ్ళాలి. సమయమైంది" అన్నారు అయ్యవారు. ఆనకట్టేసిపెట్టిన అమ్మవారి కోపానికి ఈ ప్రశ్న గండి వేసింది. అమ్మవారు అక్షింతలు చల్లడం మొదలుపెట్టారు. 'ఓకరు కోపంగా ఉన్నప్పుడు మఱొకరు మౌనంగా ఉండాలి' అన్న వారి ఒడంబడిక ఆ కోపక్షణాలలో గుర్తు రాలేదు. ఏ కారణం లేకుండ నా మీద అరవడమేంటి యని అయ్యవారు కోపపడ్డారు. అల్పాహారము తినకుండా వెళ్ళిపోయారు. ఎంత కోపమున్నా ఆహారం మీద చూపకూడదన్న మఱో ఒడంబడికనూ మరిచాడని ఇంకా కోపమొచ్చింది అమ్మవారికి.

"మీరలిగెళ్ళిపోతే నాకు ముద్ద దిగదనుకున్నారేమో" అని కంచం ముందర పెట్టుకున్నారు. ఆయనమీద కోపంలో తిందాం అనుకున్నారుగానీ నిజానికి ఆయన తినకుండా వెళ్ళిపోయారన్న బాధ ఆమెను తిననివ్వలేదు. కాసేపటికి, తానెందుకు అలా ప్రవర్తించిందో అని నొచ్చుకుని పశ్చాత్తాపపడ్డారు. మధ్యాహ్నం భోజనానికి వచ్చినపుడు తనదే తప్పంతా అని ఒప్పుకుని ఆయన చేత క్షమాపణ చెప్పించుకుందామని నిర్ణయించుకున్నారు. [పెళ్ళికాని వారంతా, ఇదెక్కటి విడ్డూరం అనుకుంటారేమో - పెళ్ళైతే తెలుసుతుంది! ఇద్దఱిలో తప్పెవరు చేసినా క్షమాపణ మాత్రం మొగుడే చెప్పాలి. అదే ఇక్కడ (అ)ధర్మం!]

ఇంద్రలోకం చేరుకున్న అయ్యవారి మనసంతా కలతలమేఘాలు ఆక్రమించుకున్నాయ్. సమావేశంలో ముఖ్య అతిథి ఈయనే. మనసొకచోట, మనిషొకచోట అనే రీతిలో సమావేశంలో పాల్గొన్నారు. భోజనవిరామం. పరవమశివుడు, "బావా, నాతోబాటు ఇంటికి రావచ్చుగా?" అంటే. భవుడు పిలిచి వెళ్ళకుంటే బాగుండదేమోనని ఆయనతోబాటు మాట్లాడుతూ నడిచారు. ఉదయం ఇంట్లో జరిగినదంతా మనసులో మెదిలింది. ఇప్పుడేం చేస్తుంటుందో అని ఊహించుకున్నారు. తను ఆహారమేమీ తినలేదుకాబట్టి తన ఇల్లాలుకూడా ఏమి తినదు అనుకున్నారు. అయినా ఇప్పటికిప్పుడు వెళ్ళి తిరిగిరావడం సాధ్యమా? అని ఆలోచిస్తుండగానే కైలాసము చేరుకున్నారు ఇద్దఱూ.


పార్వతిదేవికి ఆనందమేసింది అన్నగారి రాక. శివుడు 'నేనెంత మంచి పని చేశానో చూడు' అనే రీతిలో కోంచం గర్వంగా ఫీల్ అయ్యాడు. కుశలప్రశ్నలు అడిగింది, పార్వతి. కాసేపటికి, భోజనం వడ్డిస్తాననగా


"నాకొద్దమ్మా, మీ వారికి వడ్డించు. ఇవాళ మీ వదినేదో నోమునోచుకుంటుంది! అందుకని రోజంతా ఉపవాసముంటుంది. తను ఉపవాసమున్న రోజుల్లో నేనూ ఉపవాసముంటాను. ఏమనుకోవద్దు. ఇంతదూరమొచ్చాను, ఒక్కసారి నిన్ను చూసివెళ్దామని ఇటువచ్చాను. మఱోరోజు ఇద్దఱం కలిసి వస్తాం భోజనానికి" అని అబద్ధమాడారు.


టక్కున పార్వతి శివునివంక చూసింది, ఈ సంభాషణ వింటున్నాడో లేదో అని. నిజానికి శివుడు వీరి సంభాషణను పూర్తిగా వినలేదు. పార్వతి చూపుల్లో ఏదో ఒక ఆజ్ఞ ఉందని మాత్రం గ్రహించాడు.  ఎందుకైనా మంచిదిలే అని 'నువ్వేమంటే అదే' అనే భావంతో తలూపాడు.


"ఎప్పుడో ఒక్కసారి ఇటు దయచేస్తావు. అలా వచ్చినప్పుడే ఉపవాసం పెట్టుకోవాలా" అని నొచ్చుకుంది, పార్వతి. శివుడి భోజనం పూర్తయ్యాక మళ్ళి ఇంద్రలోకం చేరుకున్నారు.

ఇంక ఇక్కడ, తిరుమలగిరిపైన అమ్మవారేమో మధ్యాహ్నం వస్తాడు అయ్యవార అని వేచిచూస్తున్నారు.  మధ్యాహ్నంకూడా దాటిపోయింది. ఆయనేమోరాలేదు. రాకపోయినా గరుత్మంతుడిచేత వర్తమానమైనా పంపించలేదు రావడంలేదని. మఱింత బాధేసింది అమ్మవారికి. ఇక ఆయనొచ్చేది సాయంకాలమే అని అర్థమైంది. రాత్రి భోజనం తయారుచేసి ఆయనకోసం గుమ్మంపట్టుకు నిల్చున్నారు.


ఆహారంలేక అలసివచ్చిన అయ్యవారికి, నీరుకారే కళ్ళతో గుమ్మంపట్టుకుని నిలుచున్న ఆమెను చూడగానే బాధేసింది! ఆయ్యవారు పలకరించారు. అమ్మవారు విసురుగా "నాతో ఎవరూ మాట్లాడనక్కర్లేదు" అన్నారు. 'అన్నెంపున్నెం ఎఱుగని నన్ను తిట్టావు? అయినా నేనే దిగివచ్చి పలకరించాను. నువ్వు బెట్టుచేస్తావా' అని ఆయనా, 'మధ్యాహ్నం రావడంలేదన్న ముక్క గరుత్మంతుడితోనైనా వర్తమానం పంపుండచ్చుగా?' అని ఆమే, కొపాన్ని అలానే కొనసాగించారు. మౌనంగా ఆహారం ఆరగించారు.

ఆలుమగలు మధ్య ఎటువంటి గొడవైనా సరే రాత్రి నిద్రపోయేసమయానికి ఎవరో ఒకరు తగ్గి సంధి చేసుకుని సమాధానమైపోవాలి. ఒకేపానుపుపైన వైరముతో ఉన్న ఇద్దఱిని  నిద్రదేవి ఎలా అక్కునచేర్చుకోగలదు? 

అమ్మవారే దిగొచ్చారు. ఆయన దగ్గరకెళ్ళి,
"ఉదయం అలా మీమీద అలా విరుచుకుపడ్డాను; తప్పెల్లా నాదే! అయితే మీరేం చేశారు? 'ఒకరు కోపపడినప్పుడు మఱొకఱు శాంతంగా ఉండాలి' మీరు మన ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. దానికి దీనికి సరిపోయింది. అదేకాదు, 'ఎంత కోపమున్నా ఆహారం మీద చూపకూడదు' మీరు ఈ ఒప్పందాన్నికూడా అతిక్రమించారు. నా ఒక్క తప్పుకి, మీరు చేసిన రెండు తప్పులు చెల్లుబడి అయిపోయింది. రండి, కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోదాం" అని శ్రీరాగం లో ఆలకిస్తున్నారు అమ్మవారు. అంత తీయగా బ్రతిమాలుతుంటే అయ్యగారు కరిగిపోరాయేంటి? 

(కీర్తన/తాత్పర్యం చదివాక 'అమ్మవారేంటీ, పతిని ఏకవచనంలో సంబోధిస్తున్నారు? ఇది మన సాంప్రదాయానికి విరుద్ధము కదా?' అని అడుగుతారేమో. నిజానికి పతిని మీరు, గారు, ఆయన అని సంబోధించడం మనం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చుకున్న మిథ్య ఏమో అని నా ఉద్దేశము. మన ప్రాచీన సాహిత్యాలు తిరగేస్తే, పతిని ఏకవచనంలో సంబోధించేటట్టు సూచించే ఘట్టాలు కోకొల్లలు. అలా సంబోధించడంలో అనంతమైన వాత్సల్యభావామే ఉంటుందికానీ, అవమానమేమీ కాదని గుర్తించాలి.)

===============================================
రాగం : శ్రీరాగం
కౌశల్య గారి గళంలో గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు స్వరపరచిన
 AUDIO
 (సాహిత్యంలోని కొన్ని పదాలను Tune కొసం మార్చిపాడారని గమనించగలరు)
===============================================

పల్లవి 
పంతము చెల్లెను బదగదరా
యింతలోన దప్పు లెంచక పదరా
 
చరణం 1
రాని కోపమున రవ్వ సేసితి నింతే
పానుపుమీదికి బదగదరా
సోనలచెమటల సొలసితి నింతే 
తేనెమోవి దప్పి దేర్చె బదరా
 
చరణం 2
అనుమానానీకు నలిగితి నింతే 
పని గల దిక నటు పదగదరా
నను నిటు చూడగ నవ్వితి నింతే
తనిపే నీమతి తావుకు పదరా
చరణం 3
పాసిన కాకల బలికితి నింతే
బాసలు నమ్మితి బదగదరా
ఆసల శ్రీవేంకటాధిప కూడితి
వేసారపురతి వెనకకు బద

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):

పంతము = పౌరుషము
చెల్లెను = తీరిపోయింది, సరిపోయింది
పదగదరా = వెళ్దాంరారా
తప్పులెంచకు = తప్పుపట్టకు

రాని కోపమున =  పైపైకి నటిస్తున్న కోపంతో
రవ్వ సేసితి నింతే = రట్టడి చేశాను అంతే
పానుపుమీదకి = మంచంమీదకి
పదగదరా = వెళ్దాం రారా
సోనలచెమటల = చెమటలవర్షంతో
సొలసితి నింతే = నీరసపడిపోయాను
తేనెమోవి = తేనెలూరే పెదవుల
దప్పి దేర్చు పదరా = దప్పికి తీర్చుకుందాం పదరా

అనుమానానీకు = నువ్వు కోపంగా వెళ్ళాక  ఎక్కడెలా ఉన్నావో అని ఆలోచిస్తూ
నిలిగితి నింతే = నలిగిపోయాను
పని గల దిజ నటు = నీతో పనుంది
పదగదరా = వెళ్దాం రారా
నను నిటు చూడగ = నువ్వు ఇందాక ఓరకంటితో చూసినప్పుడు
నవ్వితి నింతే = (నువ్వు రాజీపడిపోదామని) నవ్వాను
తనిపె నీమతి = నీమనసులోని కోపంచాల్లారింది
తావుకు పదరా = చోటికి(మంచం దగ్గరకి) పదరా

పాసిన కాకల = పాతబడిపోయిన కోపముతో(కోపం తగ్గిపోయిందట)
పలికితి నింతే = మాట్లాడాను అంతే
బాసలు నమ్మితి = నువ్వు ఏం చెప్తే అవే నిజమని నమ్మేశాను
పదగదరా = వెళ్దాం రారా
ఆస =  ప్రేమ
వేంకటాధిప = వెంకటాద్రిని ఏలేటీ అధిపతి
కూడితి = కూడాను
వేసారపు = విసుక్కోకుండ
రతి వెనుకకు = రతి వెనుకగు = సంగమానికి జతకాడిగా
బదరా = పదరా = వెళ్దాంరారా

తాత్పర్యం :
నేను పట్టిన పంతానికి, నువ్వు పట్టిన పంతాలు చెల్లుబాటైపోయింది. ఇంక తప్పులెంచకుండ రాజీపడిపోదాం రా, స్వామీ.


ఉదయం అదేదో చిరకుతో ఉన్నాను, ఆ కోపం అప్పుడే కాసేపటికి మాయమైపోయింది. నేనే అనవస్రంగా రట్టడి చేశాను, తప్పునాదే! ఈరోజంతా నిన్ను ఇబ్బందిపెట్టాను. ఇప్పుడు అవన్ని మరిచిపోయి కబుర్లుచెప్పుకుంటూ పడుకుందాం పద. ఉదయంనుండి నీగురించే ఆలోచిస్తున్నాను. మనసంతా అలజళ్ళై, ఒళ్ళంతా చెమటలుపట్టేశాయి. నీరసపడిపోయున్నాను. గుక్కెడు మంచినీరైనా తాగలేదు. గొంతెండిపోయింది. నీ పరిస్థితికూడా అదే అని నాకు తెలుసు. తేనెలూరే పెదవులతో దాహాలు తీర్చుకుందాం పద.


నువ్వుతినకుండా కోపగించుకుని వెళ్ళిపోయావు. ఎక్కడికెళ్ళావో, ఎలా ఉన్నావో, ఎప్పుడొస్తావో అని ఆరాటంలో నలిగిపోతున్నాను. నా ఐదునిముషాల కోపానికి రోజంతా వేదనపడమని వదిలెళ్ళిపోతావా? పానుపుమీదకి రా నీపని చెప్తాను. ఇందాక భోజనంచేస్తుండగా ఓరకంట ఓ క్షణం అలా నావైపు చూశావు, రాజీపడిపోదామని వెంటనే నేను స్నేహంగా నవ్వాను. నువ్వూ నవ్వుతావని చూశాను. దొంగ నువ్వు! బిగువుగా చూపావు. నీమనసు అప్పుడే కరిగిపోయిందని నాకు తెలుసులే పద.


నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నాకసలు కోపమేలేదు. నువ్వురాగానే వాటేసుకుని అలానే ఎంతకాలమైనా ఉండిపోవాలనే అనుకున్నా. అయినా నా పౌరుషం అడ్డుపడింది. అందుకే కోపం నటిస్తూ "నాతో ఎవరూ మాట్లాడనక్కర్లేదు" అన్నాను. అదంతా ఉత్తుత్తికోపమే. నాగురించి నీకు తెలుసుకదా? నేనన్నానే అనుకో నీకెక్కడి పోయిందోయ్? నువ్వు చెప్పే తీయతీయని కబుర్లను వింటూ కరిగిపోయేదాన్ని కదా? నా ఆశలకు మూలపురుషుడైన శ్రేవేంకటపతీ, విసుక్కున్నది చాలు! రతికి జతపడుదాం రాయిక.




================================================================

rAgaM : Sree rAgaM

pallavi

paMtamu chellenu badagadarA
yiMtalOna dappu leMchaka padarA

charaNaM 1
rAni kOpamuna ravva sEsiti niMtE
pAnupumeediki badagadarA
sOnalachemaTala solasiti niMtE
tEnemOvi dappi dErche badarA

charaNaM 2
anumAnAneeku naligiti niMtE
pani gala dika naTu padagadarA
nanu niTu chUDaga navviti niMtE
tanipE neemati tAvuku padarA

charaNaM 3
pAsina kAkala balikiti niMtE
bAsalu nammiti badagadarA
Asala SreevEMkaTAdhipa kUDiti
vEsArapurati venakaku badarA

=============================================================

17 August 2011

వత్తిలోపలి నూనెవంటిది జీవనము...

మనిషి జీవితాన్ని నడిపించే ప్రధాన సారథి మనసు. తీరని కోర్కెలకు నెలవు ఈ మనసు. అందులో అన్నిరకాల కోరికలూ కలుగుతాయి. ఆ మనసు ఆజ్ఞాపించినట్టు కర్మలు చేస్తుంటాం. ఏ కోరిక చేయించిన కర్మ జీవున్ని పరిశుద్ధము చేస్తుంది, ఏ కోరిక చేయించిన కర్మ బురదలోకి తోస్తుందో విచక్షణముతో ఎన్నుకోవాలి. ఆ విచక్షణ ఎలా వస్తుంది మరి? అది రావాలంటే భగవత్తత్వం మీదకి మనసుని అప్పుడప్పుడూ మఱలిస్తుండాలి.

ఇప్పుడు మఱలిద్దాం‌రండి...


ఏమి గొప్పలున్నాయ్ ఈ మానవ జీవితంలో? ఎందుకిన్ని పోరాటాలు చేస్తున్నాం? ఇన్నిపోరాటాలు చేయిస్తూ జీవితాన్ని ముందుకు నడిపేది ఏది? ఆశ! కడ మొదల లేని ఈ వాంఛలతో నిండియున్న మనసుని నడిపించేది అదే. ఇన్ని పోరాటాలు, కష్టాలూ ఆ మనసు వాంఛ తీర్చేందుకే. అయితే ఇవన్ని వృథాయే. ఎన్ని సాధించినా వ్యర్థమే. ఎందుకంటే, ఇవేవి జీవుడుకి పరమార్థాన్ని సంపాదించిపెట్టేవి కావు.

ఈ జీవితం శాశ్వతమేమి కాదు. వత్తిలో నూనె ఉన్నంతవరకే దీపం వెలుగు. ఆ నూనె అయిపోతే చీకటే. అలా దేహములో కంటికి కనబడక జీవితాన్ని నడిపించేది ప్రాణం! ఆ ప్రాణం ఉన్నంతవరకే ఈ దేహానికి అన్నియాటలూ. నిజానికి ఈ దేహాం కూడా వ్యర్థపదార్థమే! గింజమీద ఎలాగైతే పొట్టు ఉంటుందో అలాగే ఆ ప్రాణాన్ని లోపలనిలుపుకున్న పొట్టు ఈ దేహం. మొలకొచ్చేవరకే పొట్టుయొక్క అవసరం విత్తనానికి. ఆ పైన ఆ పొట్టు వ్యర్థ పదార్థమే కదా? మఱి అటువంటి వ్యర్థపదార్థమైన ఈ దేహాం సుఖాలదారివైపుకే పాకులాడుతుంది. ఆ దేహాన్ని ప్రాణంకోసం వాడుకోవాలికానీ, ప్రాణాన్ని దేహంకోసం కాదు. దేహానికి భక్తి అంటదు. శాశ్వతము కాని ఈ దేహం కోరుకునే శారీర సుఖాలవైపుకి వెళ్ళకుండ మనసుని అదుపులో ఉంచుకోవడమే ప్రధానము.

ధనముంటే మనచుట్టూ  ఎంతమందైనా చేరుతారు. మనకన్నా గొప్పవారు లేరని పొగుడుతారు. పొగడ్తలకు మురిసిపోతాము. ఆ పొగడ్తల మత్తుకోసం ఇంకా ఇంకా ఎక్కువ సిరిసంపదలు కావాలనుకుంటాం. చాకలి మడుగులో బండకేసి ఉతుకుతుండగా ముఱికి ఎలాగైతే బట్టలను వదలిపోవునో అలా వదిలెళ్ళిపోయేటివే మనం అష్టకష్టాలుపడి సంపాదించే సిరులూ, సంపదలూ. ప్రాణం ఈ దేహాన్ని వదిలినప్పుడు ఆ సంపదలేవీ మనతో రావు. అటువంటి ఐశ్వర్యాలు ఉంటే ఎంత, లేకుంటే ఎంత?

ఈ బ్రతుకు ఎంత నీచమైనదీ? ఈ పొట్టని నింపుకునేందుకు ఎన్నెన్ని పాపములు చేయిస్తుంది? మనం చేసిన పాపాలన్నిటికీ, గాదేలోపోసిన ధాన్యంలాగా లెక్క రాయబడి ఉంది ఆ పైవానివద్ద. ఈ పాపాలనుంచీ, వేదనలనుంచీ మోక్షములేదా? ఎందుకు లేదు? ఆ వేంకటేశుని మనస్పూర్తిగా “నువ్వే శరణని” అర్థించినవారికి ఆయన కృపాకటాక్షమనేటి తాడు చేచిక్కుతుంది. ఆ తాడుపట్టుకుని మోక్షము చేరుకోవచ్చు అంటారు అన్నమయ్య.

===================================
రాగం : వరాళి
ఇక్కడ వినండి (right click and open in a new window/tab)
====================================
పల్లవి

ఏమిగల దిందు నెంతపెనగిన వృథా
కాముకపు మనసునకు కడమొదలు లేదు

చరణం 1
వత్తిలోపలినూనెవంటిది జీవనము
విత్తుమీదటిపొల్లు విధము దేహంబు
బత్తిసేయుట యేమి పాసిపోవుట యేమి
పొత్తులసుఖంబులకు పొరలుటలుగాక


చరణం 2
ఆకాశపాకాశ మరుదైన కూటంబు
లోకరంజనము తమలోనిసమ్మతము
చాకిమణుగులజాడ చంచలపు సంపదలు
చేకొనిననేమి యివి చెదరినను నేమి

చరణం 3

గాదెబోసినకొలుచు కర్మిసంసారంబు
వేదువిడువనికూడు వెడమాయబతుకు
వేదనల నెడతెగుట వేంకటేశ్వరునికృపా-
మోదంబు వడసినను మోక్షంబు గనుట

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):

ఏమిగలదిందు = ఏమున్నది ఈ జీవితంలో
ఎంత పెనగిన = ఎంత పోరాటము చేసిన
వృథా = ఫలములేదు, వ్యర్థము
కాముకపు = మాయామోహితమైన
కడమొదలు = ఎప్పుడు మొదలైందో ఎప్పుడు తెగుతుందో


వత్తి = Wick
విత్తు = గింజ, విత్తనము
పొల్లు = కింజపైనున్న పొట్టు, తవుడు
బత్తి = భక్తి, నమ్మకం, Faith
పాసి = చెడిన, పాడైన, మలినము
పొత్తులసుఖంబులు = దేహసుఖాలు
పొరలుట = తపించడము

అరుదైన = అపూర్వమైన
లోకరంజనము = విలాసము
లోకరంజనము = లోకాన్ని సంతోషపెట్టేది
చాకిమణుగు = చాకలివాళ్ళు బట్టలు ఉతికే మడుగు
చంచలపు = స్థిరములేనిది, చంచలమైన
చేకొనిననేమి = సంపాదించితేనేమి, దాచుకొన్ననేమి

గాదె = ధాన్యము Store చేసుకోవడానికి పూర్వకాలంలో వాడబడిన మట్టి పాత్ర (ఇది cylinder shape లో ఉంటుంది. 5-6 అడుగుల ఎత్తుంటుంద)
కర్మి = పాపముచేసినవాడు
వేదువిడువని = వెగటుకలిగించని
కూడు = ఆహారం
వెడమాయబతుకు = నీచమైన బ్రతుకు ("తూ జీవితం" అంటాం కదా?‌అలా అన్నమాట...)
ఏడతెగు = విడిపోవు
మోదంబు = విలాసము, సంతోషము
వడిసిన = లాగితే (వడము = త్రాడు, మోకు)

తాత్పర్యం :
ముందుమాటగ రాసినదంతా కీర్తనయొక్క తాత్పర్యమే.

=================================================

rAgaM : varALi

pallavi
Emigala diMdu neMtapenagina vRthA
kAmukapu manasunaku kaDamodalu lEdu

charaNaM 1
vattilOpalinUnevaMTidi jeevanamu
vittumeedaTipollu vidhamu dEhaMbu
battisEyuTa yEmi pAsipOvuTa yEmi
pottulasukhaMbulaku poraluTalugAka

charaNam 2
AkASapAkASa marudaina kUTaMbu
lOkaraMjanamu tamalOnisammatamu
chAkimaNugulajADa chaMchalapu saMpadalu
chEkoninanEmi yivi chedarinanu nEmi

charaNaM 3
gAdebOsinakoluchu karmisaMsAraMbu
vEduviDuvanikUDu veDamAyabatuku
vEdanala neDateguTa vEMkaTESwarunikRpA-
mOdaMbu vaDasinanu mOkshaMbu ganuTa

============================

25 May 2011

నిరతము నీ సిరులు నించేటిచోటు!



నేను ఇదివరకే అన్నట్టు అన్నమయ్య సంకీర్తనాలకు వ్యాఖ్యానం రాయడం అన్నది కత్తిమీద సాములాంటిది. ఈ టపాలో నేను ప్రస్తావించే సంకీర్తనలోని భావం చాలా సున్నితమైనది. కొందఱు మిత్రుల కోరికమేరకు ఈ సంకీర్తనకు వివరణ రాసేందుకు సాహసిస్తున్నాను.

అన్నమయ్య కీర్తనలలో నాయకుడు శ్రీవెంకటేశుడు, నాయిక అలమేలుమంగ. ఈ నాయికుణ్ణి  రేపల్లె బాలుడైన చిలిపి కృష్ణుడని, ఉగ్రరూపుదాల్చిన అహోబల నృసింహుడని, చెన్నకేశవుడని, ఆదిపురుషుడైన మహావిష్ణువని, శ్రీరాముడని, పొట్టి వామనుడని రకరకాల పేర్లతో కొలిచాడు అన్నమయ్య. నాయికను కూడ వేర్వేఱు పేర్లతో వేర్వేఱు రూపాలతో కొలిచాడు. పాలు పెరుగులమ్మే గొల్లెతగా, తాళ్ళపకవారింటి ఆడపడుచుగా, సరసాలాడే గోపికగా, పంతాల సత్యభామగా, చెంచితగా,  జానపద నాయికగా, క్షీరాబ్ధి కన్యగా, గిరిజనస్త్రీగా, లంబాడిమగువగా, భూదేవిగా ఇలా ఒక్కొక్క కీర్తనలో ఒక్కోరూపం ఆమెకి. వేర్వేఱు సందర్భాలలో ఆ మగువ ప్రవర్తనలనూ, ఆమెలో కలిగే భావాలనూ ఎన్నెన్నో కీర్తనలలో అన్నమయ్య అద్భుతంగ పలికాడు; పలికించాడు.

అప్పుడప్పుడు నాయిక, నాయకుణ్ణి నిందిస్తుంది. తనతో ప్రేమగా కాసేపు కబుర్లు చెప్పలేదనో, నగలూ-చీరలూ కొనిపెట్టలేదనో, ఇరుగుపొరుగు వారు మంచి ఇల్లుకట్టుకున్నారనో(నువ్వెందుకు కట్టలేదన్న భావంతో), అలకతీర్చడం చేతకాదనో, ముద్దుచెయ్యలేదనో, షికారుకి తీసుకెళ్ళలేదనో ఇలా ఎవేవో కారణాలకులకు నిందుస్తుంది నాయిక. ఈ కీర్తనలో నాయిక ఎందుకు నిందిస్తుందో చూద్దాం. పని ఒత్తిడిలోపడో, మఱేవో కారణాలవలనో నాయకుడు శృంగార సంయోగాన్ని మఱచిపోయాడు. దేహ వాంచలనూ, ఇష్టాలనూ తీర్చు అని నేరుగ అడగడంలేదు ఈ నాయిక. తనదేహాన్ని ఇల్లుగా వర్ణించి ఆ ఇంటిని మఱచిపోయావు అని వాపోతుంది. ఆమె దేహం అనే ఇల్లు ఆయన కొలువుండేటి చోటట, ఆ చోటు తెలియదా నీకు అన్నట్టుగా ప్రశ్నిస్తుంది నాయిక. “మరుని నగరిదండ మాయిల్లెఱగా” ఈ కీర్తనలో నాయికే స్వయంగా తన అంగాంగవర్ణన చేస్తున్నట్టు రాశారు అన్నమయ్య. ఈ శృంగార సంకీర్తనలో కొన్ని philosophical thoughts కూడా ఉండటం విశేషం.

=================================
రాగం : శ్రీరాగం
(తి.తి.దే తాళ్ళపాక సాహిత్యం - 5వ సంపూటికనుండి)


=================================



పల్లవి
మరుని నగరిదండ మాయిల్లెఱగవా
విరుల తావులు వెల్లవిరిసేటి చోటు

చరణం 1
మఱగు మూక చింతల మాయిల్లెఱగవా
గుఱుతైన బంగారుకొండల సంది
మఱపు దెలివి యిక్క మాయిల్లెఱగావా
వెఱవక మదనుడు వేటాడేచోటు

చరణం 2
మదనుని  వేదసంత మాయిల్లెఱగవా
చెదరియు జెదరని చిమ్మ జీకటి
మదిలోన నీవుండేటి మాయిల్లెఱగవా
కొదలేక మమతలు కొలువుండేచోటు

చరణం 3
మరులుమ్మెతల తోట మాయిల్లెఱగవా
తిరువేంకటగిరిదేవుడ నీవు
మరుముద్రల వాకిలి మాయిల్లెఱగవా
నిరతము నీ సిరులు నించేటిచోటు

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
మరుని = మదనుడి
నగరి = భవనము
దండ = సమీపాన, పక్కన (మఱొక్క అర్థములో హారము, పూలమాల)
మాయిల్లెఱగవా = మా యిల్లెక్కడో తెలియదా?
విరుల = పూవుల
తావులు = పరిమళాలు
వెల్లవిరిసేటి = (పరిమళములు) చిమ్మేటి, చల్లేటి

మఱగు = అలవాటుపడు, చాటు  (మఱొక్క అర్థం : అజ్ఞానము, మరిపించే)
మూక = గుంపు, సమూహము (మఱొక్క అర్థం : మందమతిగల )
చింతల = చింతచెట్లు (మఱొక్క అర్థం : కలతల)
గుఱుతు = మేర, చిహ్నము
సంది = వీధి, బీటిక
మఱపు = మఱిపించే
దెలివి = తెలివి
యిక్క = చోటు, స్థానము
వెఱవక = భాయములేకుండ

మదనుని = మన్మథుని
వేదసంత = వేదాధ్యయనమ (మదనుని వేదము అంటే కోరిక, ఆశ, కామము అని అర్థము)
చిమ్మచీకటి = గాఢమైన అంధకారము
కొదలేక = కొదవలేక, కొఱతలేక
కొలువుండేచోటు = నిత్యమువిహరించేచోటు

మరులు = మోహము, కామము
ఉమ్మెతల = ఉమ్మెత్త (ఈ చెట్టులోని కాయలు తింటే పిచ్చెక్కును)
(http://en.wikipedia.org/wiki/Datura)
(http://en.wikipedia.org/wiki/File:Datura_fruit.jpg)
మరుముద్ర = మదనుడి గుఱుతులు
వాకిలి = తలుపు, ద్వారము
నిరతము = మిక్కిలి ఆసక్తితో, ఎనలేని ఆనందముతో
నించేటి = నింపబడే

తాత్పర్యం :
మా యిల్లెక్కడో తెలియదా? మదనుడు దండ వేలాడే ప్రదేశమే! ఆ దండలోని పువ్వులు పరిమళాలు విరజిమ్మే చోటే మా యిల్లు. (నిత్యము గుండెలు చిలుకే మన్మథుడుండే చోటుకు సమీపాన ఉన్న నా మనసు అని మఱో అర్థం!)

కలతలతో కల్లోల పడే నీ మనసుని సుఖాలాతో కట్టిపడేసి, కష్టాలను మఱపించేచోటే మాయిల్లు. అటువంటి మాయింటిని ఎలా గుర్తుపట్టి చేరుకుంటావు? అక్కడ బంగారు కొండలుంటాయ్! ఆ సందే మాయిల్లు. ఆ చోటుకి ఇంకో ప్రత్యేకతకూడా ఉంది, ఎటువంటి మేధావినైనా, తన మేధస్సుని మఱిసిపోజేసే బలముగల స్థలం అది. (What a great Philosophical thought). ఈ ఒక్కచోటే మదనుడు భయంలేకుండా తన విల్లునెక్కుపెట్టి వేటాడుతుండేది. అక్కడె మాయిల్లు.

మన్మథుడి వేదమైన కామాన్ని అధ్యయనం(పఠనం) చేసేది ఇక్కడే. మఱొక్క గుర్తుకూడా ఉంది, అక్కడ చెదిరి చెదరని చిమ్మ చీకటి కమ్ముకుని ఉండ్టుంది. అక్కడే మాయిల్లు. అక్కడే నిన్ను దాచుకున్న నా మనసు ఉండేది.  ఆ మనసులో మమతలకు కొరతలేదు.

మాయిల్లు మోహాల ఉమ్మెత్తతోట. ఉమ్మెత్త కాయతింటే ఎలా పిచ్చెక్కుతుందో అలాగే మాయిల్లు కూడా మోహాలమత్తులో ముంచ్చేస్తుంది. ఓ తిరుమలమలగిరి వెంకటేశుడా గుర్తుంచుకో, మాయింటి వాకిటి ద్వారానికి మన్మథుని చిహ్నాలుంటాయి. మిక్కిలి ఆనందం కలిగించే నీ వలపు సిరులతో నిండియుండేచోటే మాయిల్లు.




============================

rAgaM : SrIrAgaM

pallavi
maruni nagaridaMDa mAyille~ragavA
virula tAvulu vellavirisETi chOTu

charaNaM 1
ma~ragu mUka chiMtala mAyille~ragavA
gu~rutaina baMgArukoMDala saMdi
ma~rapu delivi yikka mAyille~ragAvA
ve~ravaka madanuDu vETADEchOTu

charaNaM 2
madanuni  vEdasaMta mAyille~ragavA
chedariyu jedarani chimma jeekaTi
madilOna neevuMDETi mAyille~ragavA
kodalEka mamatalu koluvuMDEchOTu

charaNaM 3
marulummetala tOTa mAyille~ragavA
tiruvEMkaTagiridEvuDa neevu
marumudrala vAkili mAyille~ragavA
niratamu nee sirulu niMchETichOTu